కొత్త మొబైల్ ఫోన్ కొంటున్నారా? అయితే కరోనా వైరస్ సోకిన రోగులను ట్రాక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్యసేతు యాప్ దానిలో ఉండాల్సిందే. అప్పుడే మీ ఫోన్ పనిచేస్తుంది. కొత్త ఫోన్ కొనుగోలు చేసినవారు దానిని ఉపయోగించడానికి ముందు యాప్లో తప్పనిసరిగా తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలని కేంద్రం రూల్ తీసుకురాబోతోంది.
డిఫాల్ట్గా యాప్
ఆండ్రాయిడ్ ఫోన్ కొంటే గూగుల్ క్రోమ్, జీమెయిల్ లాంటి యాప్స్ ఎలా డిఫాల్ట్గా ఉంటాయో తెలుసుగా. లాక్డౌన్ తర్వాత ఇండియాల అమ్ముడయ్యే ప్రతి స్మార్ట్ఫోన్లోనూ ఆరోగ్య సేతు యాప్ అలా డిఫాల్ట్గా ఉండబోతోంది. దీని అమలు కోసం సెంట్రల్ గవర్నమెంట్ త్వరలో ఒక నోడల్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయనుంది. ఈ ఏజెన్సీ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలతో మాట్లాడి యాప్ను అన్ని స్మార్ట్ఫోన్లలో డిఫాల్ట్గా ఉంచేలా ఏర్పాట్లు చేయబోతోంది.
ఎంఐ షురూ చేస్తామంటోంది
ప్రభుత్వం కోరితే తాము త్వరలో తీసుకురాబోయే ఫోన్లు అన్నింటిలో ఆరోగ్యసేతు యాప్ను డిఫాల్ట్గా పెడతామని షియోమి ఇండియా ప్రకటించింది. ఇప్పటికే తమ ఎంప్లాయిస్ అందరినీ ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆర్డర్స్ ఇచ్చామని ఎంఐ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ చెప్పారు.
9 కోట్ల డౌన్లోడ్లతో దూసుకెళుతున్న యాప్
మరోవైపు ఆరోగ్యసేతు యాప్ను ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకుని వాడాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు బాగానే పనిచేస్తోంది. ఇప్పటికే 9 కోట్ల డౌన్లోడ్లతో రికార్డ్ స్థాయిలో దూసుకుపోతోందని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు.