టెక్నాలజీ నిత్యావసరంగా మారిపోయింది. కూరగాయల అంగడి నుంచి బంగారం కొట్టు దాకా అన్నింట్లోనూ టెక్నాలజీ తన ముద్ర వేసేస్తోంది. ఆన్లైన్ షాపింగ్, డిజిటల్ ట్రాన్సాక్షన్లు.. ఇప్పుడు నిత్యావసరాల మార్కెట్లోనూ టెక్నాలజీకి పెద్ద పీట వేసేశాయి. అందుకే అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా కిరాణా సరకులు, కూరగాయల వంటి వాటి వ్యాపారంలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా మరో ఈ కామర్స్ జెయింట్ ఫ్లిప్కార్ట్ కూడా కిరాణా విభాగంలోకి అడుగుపెట్టనుంది. భారత రిటైల్ రంగంలో కిరాణాకు మంచి మార్కెట్ ఉండడంతో ఫ్లిప్కార్ట్ ఈ దిశగా అడుగులు వేసింది.
వేల కోట్ల రూపాయల మార్కెట్
ఇండియాలో 80 శాతం కొనుగోళ్లు కిరాణాకు సంబంధించినవే. 125 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో వేల కోట్ల రూపాయల కిరాణా బిజినెస్ జరుగుతుంది. దీన్ని అందిపుచ్చుకోవడానికి కిరాణా విభాగంలోకి కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నామని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఇప్పటికే అమెజాన్ లాంటి సంస్థలు ఉన్నా పెద్ద గా ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలో ఫ్లిప్కార్ట్ ఎలా ముందుకెళుతుందోనని మార్కెట్ వర్గాలు, మిగిలిన ఈ కామర్స్ కంపెనీలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి.
ఇది రెండోసారి
బెంగళూరుకు చెందిన ఫ్లిప్కార్ట్ ఈ విభాగంలోకి అడుగుపెట్టడం ఇది రెండోసారి. 2015 చివరిలో ఫ్లిప్కార్ట్ ‘నియర్బై’ పేరిట ఒక ప్రత్యేక కిరాణా యాప్ను ప్రారంభించింది. ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రాసరీస్ను సూపర్ మార్కెట్ల నుంచి వినియోగదారులకు అందజేసేందుకు ఈ యాప్ను ప్రారంభించింది. అయితే కస్టమర్ల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో కొన్నాళ్ల తర్వాత ఆ బిజినెస్ ను విరమించుకుంది. మరి ఈసారి ఎలాంటి ప్లాన్స్ తో ముందుకెళుతుందో చూడాలి.