టెలికం సెక్టార్లో ప్రైస్ వార్ కొనసాగుతోంది. ముఖ్యంగా టెక్నాలజీని సామాన్యుడి చెంతకు చేరుస్తూ రిలయన్స్ జియో తెచ్చిన ఊపు దేశంలోని మొబైల్ యూజర్లకు ఆఫర్ల పంట పండిస్తోంది. జియో ఫ్రీ టారిఫ్తో కొన్నాళ్లుగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న మిగిలిన టెల్కోలు ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో కస్టమర్లను నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. కొత్తగా చేరే వినియోగదారులకు 249కే రూపాయలకే నెలకు 300జీబీ డాటాతో పాటు రాత్రిపూట ఉచిత కాల్స్ అందిస్తున్నట్లు వెల్లడించింది. రాత్రి 9గంటల నుంచి ఉదయం 7గంటల వరకూ ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.
రోజుకు 10 జీబీ డేటా
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లో భాగంగా రోజుకు 2 ఎంబీపీఎస్ వేగంతో 10జీబీ డేటాను వినియోగదారులకు అందించనుంది. రోజులో ఇచ్చిన డేటాను వాడుకోకపోతే మిగిలిన డేటా తరువాతి రోజు కూడా వాడుకోవచ్చు. ఈ ఆఫర్ గడువు ఆరు నెలలు. జమ్ముకశ్మీర్, అండమాన్-నికోబార్ మినహా దేశంలోని అన్ని సర్కిళ్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ కంపెనీల దూకుడుతో టెలికం రంగంలో ఇప్పటికే చాలావరకు పట్టు కోల్పోయిన బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్తో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.