టౌన్స్, సిటీస్లో ఏదైనా ఈవెంట్ చేయాలంటే పర్మిషన్ తప్పనిసరి. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే వినాయకుడి ఊరేగింపో, మ్యారేజ్ కోసం చేసేదో, పొలిటికల్ పార్టీల మీటింగ్.. ఇలా ఓపెన్ గా చేసే ఏ ప్రోగ్రామ్కైనా జీహెచ్ఎంసీ, పోలీస్ వంటి పర్మిషన్లు తీసుకోవాల్సిందే. లేదంటే ఈవెంట్ను ఆపేయడంతో పాటు అనుమతులు లేవన్న కారణంతో చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. అందుకే ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా ఆర్గనైజర్లు వెళ్లి పర్మిషన్ కోసం అప్లయి చేస్తారు. అయితే ఈ ప్రాసెస్ లో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కు ఎంతో కొంత చేతిలో పెడితేగానీ పర్మిషన్ దొరకదు. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, తాజాగా రాచకొండ కమిషనరేట్లలో మినిస్టీరియల్ స్టాఫ్ ఈ పర్మిషన్లు ఇవ్వడానికి పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటివాటికి చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీస్ సిద్ధమయ్యారు. అనుమతులన్నీ ఆన్ లైన్లోనే ఇచ్చేలా విధానం రూపొందించారు.
టైమ్ సేవింగ్ మెథడ్
ఈవెంట్లు నిర్వహించేవారు వాటి అనుమతుల కోసం నేరుగా వచ్చి కలిసే పని లేకుండా ఆన్లైన్లో అప్లయి చేసుకోవచ్చని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. ఆమ్యామ్యాలు లేకుండా ట్రాన్స్పరెంట్గా పర్మిషన్లు ఇచ్చేందుకే ఆన్లైన్ వ్యవస్థను తీసుకొచ్చామంటున్నారు. దీనివల్ల సమయం కూడా ఆదా అవుతుందని చెబుతున్నారు.
వెబ్ సైట్ నుంచే..
సో... సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈవెంట్స్ కు పర్మిషన్ కావాలంటే ఇకపై గచ్చిబౌలిలో ఉండే కమిషనరేట్కు వెళ్లాల్సిన పని లేదు. సైబరాబాద్ పోలీసుల వెబ్సైట్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే ఈవెంట్ నిర్వహించడానికి కనీసం ఒక వారం ముందే ఈ పని చేయాలి. అలా వచ్చిన ఆన్ లైన్ దరఖాస్తులను పరిశీలించి వారు అనుమతి ఇవ్వాలో లేదో నిర్ణయిస్తారు. మొత్తానికి పోలీసులు కూడా ఆన్ లైన్లో కుమ్మేస్తున్నారండోయ్.