కరోనా వైరస్ ఉన్న వ్యక్తులను ట్రాక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్యసేతు యాప్ ఇప్పుడు అందరికీ తప్పనిసరి కాబోతోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈయాప్ తప్పనిసరి అని గవర్నమెంట్ ఆదేశాలిచ్చింది. ప్రైవేట్ ఉద్యోగులు కూడా తప్పనిసరిగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా కంపెనీ మేనేజ్మెంట్లు బాధ్యత తీసుకోవాలని ఆర్డర్స్ వేసింది. ఇక లాక్డౌన్ సడలింపుల్లో కూడా ఆరోగ్యసేతు యాప్ కీలకం కానుంది. ఇంతకీ ఆరోగ్యసేతు యాప్ ఎవరెవరు తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలో ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అవేంటో చూద్దాం.
విమాన ప్రయాణానికి
లాక్డౌన్ తర్వాత విమానాల్లో ప్రయాణించాలనుకునేవారు అందరూ ఆరోగ్యసేతు యాప్ను తప్పనిసరిగా తమ స్మార్ట్ఫోన్ను డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించాల్సిందే. ఈ మేరకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శుక్రవారం గైడ్లైన్స్ రిలీజ్ చేసింది.
రైలు ప్రయాణానికీ
ప్రస్తుతం రైళ్లను పరిమితంగా నడుపుతున్నారు. దీనికి డైరెక్ట్గా ఐఆర్సీటీసీ వెబ్సైట్లలో మాత్రమే టికెట్లిస్తారు. ఈ ప్రయాణికులు నేరుగా ఆన్లైన్ టికెట్ చూపించి, రైల్వేస్టేషన్లో థర్మల్ స్క్రీనింగ్ చేయించుకుని కరోనా లక్షణాలు లేవని తేలితేనే రైలు ఎక్కనిస్తారు. అలాగే వీరందరూ తప్పనిసరిగా తమ స్మార్ట్ఫోన్లో ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించడం తప్పనిసరి అని రైల్వే ప్రకటించింది.
మెట్రోల్లో వెళ్లాలన్నా ఉండాల్సిందే
రైళ్లే కాదు లాక్డౌన్ తర్వాత మెట్రో రైళ్లలోనూ ప్రయాణించాలంటే ఆరోగ్యసేతు యాప్ మీ మొబైల్లో తప్పనిసరిగా ఉండాలని సెంట్రల్ ఇండస్ట్రియల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రకటించింది.
ప్రొడక్ట్స్ డెలివరీ చేసేవారికి
జొమాటో నుంచి అమెజాన్ దాకా, స్విగ్గీ నుంచి బిగ్బాస్కెట్ దాకా వస్తువులను హోం డెలివరీ చేసే వ్యక్తులందరూ ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరిగా వాడాల్సిందే.
క్రీడాకారులకు కూడా
క్రీడాకారులకు కూడా ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరిగా వాడాల్సిందేనని ఆదేశాలిస్తున్నారు. హాకీ ఇండియా ఇప్పటికే తమ ఆటగాళ్లందరూ ఆరోగ్యసేతు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పింది. అలా అయితేనే పోటీలకు అనుమతిస్తామని చెప్పింది.