ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతోంది. దిగ్గజ సంస్థ యాపిల్ ను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చేందుకు ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. యాపిల్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విల్లియమ్స్ తో భేటీ అయి, పలు అంశాలపై చర్చించారు. స్థిరమైన అభివృద్ధిని సాధిస్తోన్న భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయమని చంద్రబాబు ఆయనకు వివరించారు. రాజధాని నిర్మాణం జరుగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఇదే అద్భుత అవకాశమని ఆయన విలియమ్స్ తో అన్నారు. మంచి ఉత్పాదక సామర్థ్యం ఉన్న యువతను ఏపీలో ఉన్నారని.. యాపిల్ సంస్థ కాలుమోపేందుకు అన్ని అనుకూలతలూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని ఆయన అన్నారు.
వృద్ధి, అభివృద్ధి అంశాల్లో సరైన భాగస్వామ్యం కోసం అన్వేషిస్తున్నామని వ్యాపార దక్షత, సమర్ధత, అపారమైన తెలివితేటలు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొంతమని చెప్పారు. ఏపీలో మంచి వనరులతో పాటు మానవ వనరులు కూడా పుష్కలంగా ఉన్నాయని వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టి మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు యాపిల్ సీవోవోను కోరారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో యువత సంఖ్య అత్యధికంగా ఉందని తెలిపారు.
ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై క్వాల్కమ్ టెక్నాలజీస్ ఆసక్తి ..
ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనలో రెండో రోజు క్వాల్కమ్ టెక్నాలజీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గోపి సిరినేని, డైరెక్టర్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ చందన పైరాలతో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఈ సంస్థ ఆసక్తి కనబరిచింది. క్వాల్కమ్ టెక్నాలజీ ఫైబర్ గ్రిడ్లో భాగస్వాములు కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. దీని కోసం రాష్ట్రంలో పర్యటించి ప్రాజెక్టును అధ్యయనం చేసిన అనంతరం ఏయే అంశాల్లో సాకారం అందించగలరో చెప్పాలని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గోపి సిరినేనికి సీఎం చంద్రబాబు సూచించారు. డ్రైవర్ లేని కార్లు, డ్రోన్ల ద్వారా గృహావసరాలకు వివిధ ఉత్పత్తులను సరఫరా చేసే ప్రదర్శనను సీఎం చంద్రబాబు తిలకించారు.
బెలూన్లతో ఇంటర్నెట్
అనంతరం స్టాటోస్పియర్ బెలూన్స్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించిన విభాగాధిపతి అలిస్టర్తో సమావేశమయ్యారు. అదే విధంగా లాస్ ఏంజెల్స్లో టెస్లా ప్రెసిడెంట్ సీఎఫ్వో ఏలోన్ మస్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మర్యాదపూర్వకంగా కలిసి వివిధ అంశాలపై చర్చించారు.
మాతృభూమి రుణం తీర్చుకోండి
జన్మభూమి రుణాన్ని తీర్చుకునే తరుణం వచ్చిందని, మాతృభూమికి, పుట్టిన గడ్డకు దూరం కావద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. పుట్టిన గడ్డతో నిరంతర సంబంధాలు కొనసాగించాలని సూచించారు. ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూయర్ ఒక బెస్ట్ ప్రాక్టీస్ని అందించాలని కోరారు. అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం అక్కడ స్థిరపడ్డ భారతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ అమెరికాలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తునే సొంత దేశం, రాష్ట్రంలో విస్తరించాలని పెట్టుబడులు పెట్టేందుకు రావాలని కోరారు. ఈ విందు సమావేశంలో మూడు ముఖ్యమైన సంస్థలతో చంద్ర బాబు బృందం ఎంవోయులు చేసు కుంది. పది వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఈవీఎక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీ, 2 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించేలా ఇన్నోవా సొల్యూషన్స్తో, ఇంక్యూబేటర్ , కో-వర్కింగ్ స్పెస్ అంశాల్లో సహకరించేందుకు హైబ్రిడ్జితో మరో ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది.