భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్.. షార్ట్కట్లో చెప్పాలంటే బీఎస్ఎన్ఎల్. కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్లు రాజ్యమేలుతున్న సమయంలో బీఎస్ఎన్ఎల్ ఫోన్ కనెక్షన్కు అప్లయి చేసుకుంటే రెండు, మూడేళ్లకు వచ్చేది. అంత డిమాండ్ ఉండేది. ల్యాండ్ ఫోన్లు దాటి సెల్ఫోన్లు వచ్చాక బీఎస్ఎన్ఎల్ పరిస్థితి తల్లకిందులైపోయింది. స్పెక్ట్రం లైసెన్సులు దక్కించుకున్న ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్, తాజాగా జియో లాంటి కంపెనీలు అర్బన్ యూజర్లను విపరీతంగా ఆకర్షించేశాయి. కానీ ఇప్పటికీ మీరు ఓ మారుమూల పల్లెకు వెళితే లేదూ ఏదైనా ఇండియాలో ఏదైనా అటవీప్రాంతానికో, దీవికో వెళితే మీ సెల్ఫోన్ మోగాలంటే అది కచ్చితంగా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ అయి ఉండాలి. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అంత పటిష్టంగా ఉంటుంది. తాజాగా టెలికం కంపెనీలన్నీ టారిఫ్లు ఏకంగా 40% పెంచేశాయి. కానీ బీఎస్ఎన్ఎల్ పెంచలేదు. ఈ పరిస్థితుల్లో బీఎస్ఎన్ఎల్లే బెటరా అనే చర్చ మళ్లీ మొదలైంది. దీనిపై కొందరు టెలికం రంగ నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
నెట్వర్క్ స్పీడే
ఎయిర్టెల్, వొడాఫోన్, జియో ఇలా టెలికం కంపెనీలన్నీ 4జీ నెట్వర్క్ను మూడేళ్ల నుంచి వాడుతున్నాయి. 5జీకి సన్నాహాలు కూడా మొదలెట్టేశాయి. కానీ బీఎస్ఎన్ఎల్ ఇంకా 3జీలోనే ఉంది. అయినా కూడా దీని స్పీడ్ చాలా బాగుంటుంది. మిగతా కంపెనీల 4జీ నెట్వర్క్లతో పోటీ పడి మరీ డేటా స్పీడ్ ఇవ్వగలుగుతుంది. 4జీ స్పెక్ట్రంకు కూడా బీఎస్ఎన్ఎల్కు అనుమతి వచ్చేసింది. త్వరలోనే 4జీ కూడా వస్తుంది. కాబట్టి డేటా స్పీడ్ మరింత బాగుండే అవకాశాలున్నాయి.
కనెక్టివిటీ కేక
దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా నెట్వర్క్ బీఎస్ఎన్ఎల్కే సాధ్యం. ఎందుకంటే ల్యాండ్ ఫోన్ల కాలం నుంచి వేసుకున్న పటిష్టమైన నెట్వర్క్, ఫీల్డ్ లెవెల్లో వేల మంది ఉద్యోగులుండటం, లక్షల కొద్దీ టవర్లు బీఎస్ఎన్ఎల్ కనెక్టివిటీని నేటికీ నెంబర్వన్గా ఉంచుతున్నాయి. అండమాన్ నికోబార్ లాంటి దీవుల్లో కూడా అద్భుతమైన నెట్వర్క్ బీఎస్ఎన్ఎల్ సొంతం.
పాత ధరలతోనే పండగ చేసుకోవచ్చు
మొన్నటిదాకా ఆఫర్ల వర్షం కురిపించిన టెలికం కంపెనీలు డిసెంబర్ నుంచి కస్టమర్లను మళ్లీ బాదేయడం మొదలుపెట్టాయి. ఎయిర్టెల్, వొడాఫోన్, జియో ఇలా ప్రైవేట్ కంపెనీలన్నీ యావరేజ్న 40 శాతం ధరలు పెంచాయి. 200 రూపాయల ప్లాన్ 250 రూపాయలకు పెంచేశాయి. బీఎస్ఎన్ఎల్ మాత్రం ధరలు పెంచలేదు.
* ఎయిర్టెల్లో రోజుకు 1.5 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఇచ్చే 365 రోజుల ప్యాక్ మొన్నటి వరకు 1699 రూపాయలు. దీన్ని ఇప్పుడు 2398 రూపాయలకు పెంచారు. బీఎస్ఎన్ఎల్లో మాత్రం అదే 1699 ధర కొనసాగుతోంది. అంతేకాదు రోజుకు 2జీబీ డేటా ఇవ్వడం మరో హైలెట్.
* బీఎస్ఎన్ఎల్ 3జీ అయినా ఎయిర్టెల్ 4జీ కంటే నెట్వర్క్ స్పీడ్ బాగుంటుందని పెద్ద సిటీల్లో యూజర్లు కూడా చెబుతారు.
* అలాగే 399, 499 రూపాయల బీఎస్ఎన్ఎల్ రక్షాబంధన్ ప్యాకేజ్లు కూడా ఇతర నెట్వర్క్లతో పోల్చితే చాలా చౌక. ఇదే ధరలో మొన్నటివరకు మిగతా కంపెనీలు 74 రోజుల వ్యాలిడిటీ ఇస్తే బీఎస్ఎన్ఎల్ 80 రోజుల వ్యాలిడిటీ ఇస్తోంది.